జీవన్ రెడ్డికి 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చింది కాంగ్రెసే.. కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు భయపడం: మంత్రి పొన్నం
- ఎవరి దయాదాక్షిణ్యాలతోనో తాము అధికారంలోకి రాలేదన్న పొన్నం
- కాంగ్రెస్ లో దశాబ్దాల పాటు ఉండి అవమానం జరిగిందని చెబుతున్నారంటూ జీవర్ రెడ్డిపై ఫైర్
- బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాలు ఆలస్యమయ్యాయని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనా, బీఆర్ఎస్ పార్టీలో నిన్న చేరిన జీవన్ రెడ్డిపైనా మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలే కానీ, విమర్శలకు మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో తాము అధికారంలోకి రాలేదని, ప్రజలు ఎన్నుకుంటేనే వచ్చామని పొన్నం స్పష్టం చేశారు. ప్రభుత్వం కూలిపోతుందంటూ కేసీఆర్ పెడుతున్న 'పిల్లి శాపనార్థాలకు' భయపడేది లేదని, మరో 10 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఏకంగా 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చి గౌరవించిందని, మరి ఆయన పార్టీకి తిరిగి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్లో దశాబ్దాలుగా ఉండి ఇప్పుడు అవమానం జరిగిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ సభ పెట్టారు కాబట్టే తాము రైతు భరోసా నిధులు విడుదల చేశామన్న వాదనను పొన్నం కొట్టిపారేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాలు ఆలస్యమయ్యాయని, అయినా తమ ప్రభుత్వం ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించాలని, చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.